విద్యార్థులవి త్యాగాలు కావా: కావూరికి ఎంపిల ప్రశ్న
తెలంగాణ నేతలమంతా ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రం సాధిస్తామని చెప్పారు. మద్రాసు రాష్ట్రం నుండి సీమాంధ్రులు కారణం లేకుండానే విడిపోయారా అని ప్రశ్నించారు. కర్కశ నిజాం ఎదిరించి పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా తాము ఉద్యమిస్తామన్నారు. ఎవరూ హింసా మార్గంలో వెళ్లడం లేదని అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు మానసికంగా కలిసే పరిస్థితి లేనందున విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని సూచించారు. ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సీమాంధ్ర నేతలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదన్నారు. టి-కాంగ్రెసులో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవన్నారు. సీమాంధ్రులు వంచించే వైఖరి మానుకోవాలన్నారు. వారి కుట్రలను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 100 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా లేదని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు గురువారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ఉద్యమం అరవయ్యేళ్లుగా కొనసాగుతుందన్నారు. తమకు తెలంగాణ తప్ప మరో ప్రతిపాదన అవసరం లేదన్నారు. తెలంగాణపై ఎలాంటి రాజీ ప్రసక్తి లేదన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల విషయంలో మీడియా అవాస్తవాలు ప్రసారం చేస్తుందని ఆరోపించారు. అధిష్టానం మాకు చీవాట్లు పెట్టినట్లు ప్రసారం చేయడం సరికాదన్నారు. ఎంపీల గౌరవాన్ని తగ్గించే విధంగా రాయవద్దని కోరారు. కావూరి వంటి నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోక పోవడం విచారకరమన్నారు.