వైయస్ జగన్ ఎమ్మెల్యేల ధిక్కారం, నో యాక్షన్
బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని అందరూ భావించారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటుందని భావించారు. ఆయన దూకుడు చూస్తుంటే అలా అనిపించింది కానీ అటువంటిదేమీ లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మారితే పార్టీ గాడిలో పడుతుందని అనుకున్నారు. గాడిలో పడకపోగా మరింత విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ ప్లీనరీకి వెళ్లే ధైర్యం చేశారంటే నాయకత్వ బలహీనత కూడా వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులకు పూర్తిగా తెలిసిపోయినట్లే ఉంది.
ప్లీనరీలో పాల్గొనడమే కాదు, వైయస్సార్ పార్టీని సొంతం చేసుకుంటూ కొంత మంది మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వేదికపై నుంచి మాట్లాడారు కూడా. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తిరుగుబాటు చూస్తుంటే కాంగ్రెసు పార్టీ నాయకత్వ అసమర్థత స్పష్టమవుతోందని అంటున్నారు.