కావూరికి కేంద్ర మంత్రి పదవి, పది కొత్త ముఖాలు?
అయితే, మారిన పరిస్థితిలో కావూరి సాంబశివరావుకు అవకాశం కల్పించాలని అనుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి, కిశోర్ చంద్రదేవ్, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ కూడా రాష్ట్రం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కానీ, సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కావూరికి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ సమస్యకు పరిష్కరించడం సులభమవుతుందని ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నేతలు మరింతగా అశాంతిని సృష్టిస్తారని భావిస్తే మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి.
కాగా, రేపు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారు. కొత్తగా పది మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. డిఎంకె నుంచి ఒకరికి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బహుశా, టిఆర్ బాలుకు ఆ అవకాశం దక్కవచ్చునని అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు కేబినేట్ హోదా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కపిల్ సిబల్ నుంచి ఒక శాఖను తప్పిస్తారని అంటున్నారు. మంత్రుల శాఖలు భారీగా మారే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తొలి నలుగురు సీనియర్ మంత్రులను మాత్రం ఏ రకంగానూ కదిలించే అవకాశాలు లేవని చెబుతున్నారు.