వైయస్ జగన్ ఫ్యాక్టర్: రాయలసీమకు మొండిచేయి
ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఒకరు, ఆంధ్రా ప్రాంతం నుండి ముగ్గురు ప్రాతనిధ్యం వహిస్తుండగా సీమ నుండి మాత్రం ఎవరూ లేక పోవడం గమనించదగ్గ విషయం. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం భారీగా ఉండే రాయలసీమ ప్రాంతానికి మంత్రివర్గంలో అధిష్టానం చోటు కల్పించక పోవడంపై అక్కడి ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైయస్ జగన్ వైపు ఎవరు వెళతారో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఉన్నందునే కేంద్రం సీమకు ప్రాతినిధ్యం కల్పించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు మంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ జగన్ను అడ్డుకోవడానికి చేసిందేమీ లేదు. దీనిపై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో మరొకరికి అవకాశం కల్పించేందుకు కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం నుండి కేంద్రానికి 32 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్రం పైన కేంద్రం చిన్నచూపు చూస్తుందన్న భావన అందరిలోనూ ఉంది.
మన ఎంపీ సంఖ్య ప్రకారం కనీసం మంత్రివర్గంలో పదిమంది వరకు అవకాశం కల్పించాల్సి ఉంది. కానీ ఆ స్థాయిలో మనకు ఎప్పుడూ అవకాశం దక్కడం లేదు. కర్నూలు నుండి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాల నుండి ఎస్పీవై రెడ్డి, అనంతపురం నుండి అనంత వెంకటరామ రెడ్డి వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించక పోవడం గమనించదగ్గ విషయం. తెలంగాణ నుండి వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, సీమాంధ్ర నుండి కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం ప్రతిసారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికీ వారికి సైతం అవకాశం రావడం లేదు.