ముంబై పేలుళ్ల వెనక అండర్ వరల్డ్ పాత్ర?
అండర్ వరల్డ్కు చెందిన కొన్ని గ్రూపుల మధ్య సయోధ్య కూడా కుదిరిందని అంటున్నారు. ముంబైలో పకడ్బందీ నెట్వర్క్, బలమైన స్థానిక మద్దతు ఉంటేనే ఇటువంటి వరుస పేలుళ్లకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. వేరే వాళ్ల ఆర్థిక సహాయంతో అండర్ వరల్డ్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.
హర్కత్ - ఉల్ - జిహాద్ - ఆల్ - ఇస్లామీ (హుజీ) ముంబై, హైదరాబాద్, బెంగళూర్, కోల్కత్తా నగరాల్లో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని మూడు రోజుల క్రితం కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో పేలుళ్లు సంభవించాయి. బిఎస్ఎఫ్ ఇచ్చిన ఈ హెచ్చరికల గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. ఈ సమాచారం బిఎస్ఎఫ్కు బంగ్లాదేశ్ నుంచి అంది ఉంటుందని భావిస్తున్నారు.
మరో కోణం కూడా అందులో కనిపిస్తోంది. కాశ్మీరీ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. జులై 13వ తేదీని కాశ్మీరీ ఉగ్రవాదులు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. 1931 జులై 13వ తేదీన దోగ్రా బలగాలు 22 మంది కాశ్మీరీలను కాల్చి చంపాయి. కాశ్మీరీలకు అంతటి శక్తి లేదనే మాట కూడా వినిపిస్తోంది. అయితే, ఈ పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారం పొంది వచ్చునని అనుమానిస్తున్నారు.