తెలంగాణ మంత్రులతో బొత్స చర్చలు విఫలం
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకుండా రాజీనామాలను ఎలా వెనక్కి తీసుకుంటామని మంత్రులు బొత్సను అడిగినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుందని వారు తెగేసి చెప్పారు. కనీసం సంప్రదింపులు జరుపుతామనే హామీ కూడా తమకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధమైన హామీ రాకుండా రాజీనామాలను ఉపసంహరించుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, అందుకు తాము సిద్ధంగా లేమని వారు చెప్పారు.
పార్టీ అధిష్టానంతో తెలంగాణపై చర్చలు జరపాలని, తమ మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని మంత్రులు బొత్స సత్యనారాయణకు సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణపై త్వరలో ఓ ప్రకటన వస్తుందని బొత్స సత్యనారాయణ వారికి చెప్పినట్లు సమాచారం. వారంలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ పార్టీ అధిష్టానం నుంచి గానీ ప్రకటన రావచ్చునని ఆయన మంత్రులతో చెప్పారని అంటున్నారు.