జగన్కు జై కొట్టిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
కాగా కర్నూలు జిల్లా నుండి చాలా సీనియర్ అయిన రాంభూపాల్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తనకు స్థానం కేటాయించనందుకు అప్పట్లో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన పరోక్షంగా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు సంబంధించిన అంశంలో సీనియారిటీని పక్కన పెట్టి మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అయితే జగన్ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చిన కారణంగానే ఆయన జగన్ పార్టీలోకి వెళుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. కిరణ్ మంత్రివర్గంలో చోటు దక్కని సమయంలో కార్యకర్తలో సమావేశం ఏర్పాటు చేసి జగన్ వైపు వెళ్లాలా లేదా అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పట్లో కార్యకర్తలు కాంగ్రెసులోనే ఉండమంటున్నారని చెప్పి అప్పటి వరకు తన జంపింగ్ను వాయిదా వేసుకున్నారు.
తాజాగా మరోసారి కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. చివరకు ఆయన జగన్తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. కార్యకర్తల ఒత్తిడి మేరకు జగన్తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కక పోవడం వల్లనే ఆయన కాంగ్రెసును వీడుతున్నారనేది పలువురి అభిప్రాయం. కాగా జిల్లాకు చెందిన మరో నేత చెన్నకేశవర రెడ్డి సైతం జగన్తో వెళ్లడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సోమవారం జగన్కు తన ఇంట్లో లంచ్ ఏర్పాటు చేసి ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలులో దివంగత వైయస్ విగ్రహం ప్రతిష్టించే ప్రాంతాన్ని సైతం ఆయన పరిశీలించినట్లుగా తెలుస్తోంది.