కెయు, ఓయుల్లో మావోలున్నారని ప్రధానికి ఫిర్యాదు
తెలంగాణ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రతిపాదనను అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం వాదనలు పూర్తయ్యాయని ఇక సమస్యనే పరిష్కరించాల్సి ఉందని, అది త్వరగా పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. రెండో ఎస్సార్సీ అంశం, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. అధిష్టానంతో ఏ చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏ చర్చలోనైనా ఆరో సిఫార్సునే ఆమోదిస్తామని అన్నారు. కాంగ్రెసులో విభేదాలు లేకుండా చూడాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని అన్నారు.
తాము సూచించిన అంశాలను కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. అన్ని ప్రాంతాల సెంటిమెంట్ అధిష్టానం అర్థం చేసుకుందని ప్రధాని చెప్పారన్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలు క్రమశిక్షణతో ఉండాలని ప్రధాని సూచించారన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ సిఫార్సు అమలు కోసమే తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయంలో మావోయిస్టులు ఉన్నారని ప్రదానికి రిపోర్టు ఇచ్చామన్నారు. పోలీసుల సమాచారంతోనే దానిని ఇచ్చామన్నారు. తాము ఏదో ఒక పరిష్కారంతో ఢిల్లీ నుండి వెళతామని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మంత్రులు వెళ్లక పోయినా ఫైళ్లను సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని గాదె వెంకటరెడ్డి అన్నారు.