విశాఖ కోర్టులో రామోజీరావుకు ఎదురుదెబ్బ
లీజు పొడగింపునకు ఆదిత్యవర్మ అంగీకరించకపోవడంతో న్యాయస్థానంలో కేసు వేశారు. రామోజీ తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆదిత్యవర్మ మరో కేసు వేశారు. నాలుగేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఇటీవల రామోజీ మూడు మధ్యంతర పిటిషన్లు వేశారు. కేసుకు సంబంధించి ఆదిత్యవర్మ ఇచ్చిన రాతపూర్వక వివరణపై అభ్యంతరాలను తెలియజేస్తామని ఒకటి, ప్రభుత్వం చేస్తున్న వాదనలో (రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయింపు- పరిహారానికి సంబంధించి) అవాస్తవాలు ఉన్నాయని, వీటిపై వివరణ ఇస్తామని, ఆదిత్యవర్మతో కుదుర్చుకున్న లీజు ఒప్పంద పత్రాలు బ్యాంకులో ఉన్నందున అవి వచ్చేవరకు కేసు విచారణ నిలుపు చేయాలని కోరుతూ ఇంకొకటి దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదప్రతివాదనలు జరిగాయి.
మూడో పిటిషన్కు సంబంధించి - లీజు ఒప్పంద పత్రాలు హైదరాబాద్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైఫాబాద్ బ్రాంచ్లో తాకట్టులో ఉన్నట్లు రామోజీ న్యాయవాది కోర్టుకి చెప్పారు. అవి వచ్చేవరకు విచారణ నిలుపు చేయాలని కోరారు. అయితే ఆదిత్యవర్మ దగ్గర మరో ఒప్పందపత్రం ఉన్నందున కేసు విచారణ కొనసాగించాలని న్యాయమూర్తి వి.వి.శేషుబాబు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం మొత్తం మూడు పిటిషన్లనూ కొట్టివేశారు. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు. వర్మ తరఫున సీనియర్ న్యాయవాది వి.వి.రవిప్రసాద్ కోర్టుకు హాజరయ్యారు.