తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు నెలల గడువు
అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. కె. కేశవరావు, కె. జానారెడ్డి నాయకత్వంలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు విధులకు హాజరు కావాలనే ఆజాద్ సూచనను మంత్రి గీతారెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ప్రకటనలో జాప్యం చేస్తూ విధులకు హాజరు కావాలంటే కుదరదని ఆమె చెప్పారని సమాచారం. ఏ విధమైన హామీ పార్టీ అధిష్టానం నుంచి రాకుండా విధులకు హాజరైతే తమను ద్రోహులుగా పరిగణిస్తారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో 19 పార్లమెంటు సీట్లలో 16 గెలుస్తుందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు కావాలని తెలంగాణ ప్రతినిధులంతా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.