ప్రధానిని, చిదంబరాన్ని కేసులోకి లాగిన రాజా
తాను ఏ విధమైన తప్పూ చేయలేదని టెలికం మాజీ మంత్రి ఎ. రాజా అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఆయన సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ ముందు తన వాదన వినిపించారు. తనను తాను సమర్థించుకున్నారు. ఎన్డిఎ ప్రభుత్వం, తమ ప్రభుత్వం రూపొందిచిన విధానాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వ విధానం తప్పయితే తనకు ముందు ఆ విధానాన్ని అమలు చేసినవారు కూడా జైలుకు రావాల్సిందేనని ఆయన అన్నారు.
విధానాన్ని అమలు చేసిన రాజాను ప్రాసిక్యూట్ చేస్తే 1993 నుంచి అదే విధానాన్ని అనుసరించినవారిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని రాజా తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. విధానం తప్పయితే తనకు ముందు దాన్ని అమలు చేసిన టెలికం మంత్రులంతా జైలు పాలు కావాల్సిందేనని రాజా అన్నారు. టెలికం మంత్రిగా అరుణ్ శౌరి 26 లైసెన్సులు, దయానిధి మారన్ 25 లైసెన్సులు, తాను 122 లైసెన్సులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సంఖ్య ఇక్కడ ప్రధానం కాదని, వారెవరూ కూడా స్పెక్ట్రమ్ను వేలం వేయలేదని ఆయన చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాన్ని తాను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. తాను 2003 మంత్రి వర్గ నిర్ణయాన్ని అమలు చేసినట్లు ఆయన తెలిపారు.