తెలంగాణపై ఇదే ఫైనల్: అధిష్టానంపై ఒత్తిడికి టి-కాంగ్రెసు
చర్చలతోనే సమస్య పరిష్కారం అని అధిష్టానం సూచించడంతో టి-కాంగ్రెసు తెలంగాణ ఇస్తామనే సానుకూల సంకేతాలు వస్తేనే చర్చలకు సిద్ధమని సమాధానం చెప్పారు. ఆజాద్తో భేటీకి ముందు తెలంగాణకు సానుకూల నిర్ణయం రావడంతో పాటు ఆజాద్తో భేటీలో తెలంగాణకు సానుకూలం కనిపిస్తేనే తదుపరి చర్చలకు వారు సుముఖంగా ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే సీమాంధ్రులతోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో వారికి సానుకూల నిర్ణయాలు కనిపించకపోతే రాజీనామాలపై బెట్టు దిగేందుకు ససేమీరా అనే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పదేళ్లు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన తీసుకు వచ్చిన కారణంగా సానుకూతకే ఎక్కువ అస్కారాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్తో సమావేశం అవుతారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, మందా జగన్నాథం, రాజయ్యలు శనివారం ఢిల్లీ వెళ్లగా రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం ఉదయం బయలుదేరారు. ఆజాద్తో భేటీకి ముందు టి-కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకుంటారు.