తిరుగుబాటు, యెడ్డీ వెనక 75 మంది ఎమ్మెల్యేలు
ఈ నెల 31వ తేదీన రాజీనామా చేయడానికి అంగీకరించిన యడ్యూరప్ప శుక్రవారం అకస్మాత్తుగా మాట మార్చారు. యు - టర్న్ తీసుకుని కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. అక్రమ మైనింగ్లో లోకాయుక్త తప్పు పట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం యడ్యూరప్పను ఆదేశించింది. బిజెపి అగ్ర నాయకత్వానికి మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. బిజెపియేతర ప్రభుత్వానికి మద్దతిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. యడ్యూరప్ప బిజెపిపై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆయన పరోక్షంగా చెప్పారు. దీంతో బిజెపి అగ్రనాయకత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.
యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరం లేదనేది కర్ణాటక పార్టీ పార్లమెంటు సభ్యుల ఏకగ్రీవ అభిప్రాయమని పార్లమెంటు సభ్యుడు డిబి చంద్రగౌడ చెప్పారు. లీకైనందున లోకాయుక్త నివేదిక తన విలువను కోల్పోయిందని ఆయన అన్నారు. యడ్యూరప్ప వ్యక్తి కారని, సిఎంగా ఓ వ్యవస్థ అని, అధిష్టానం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. గాలి బ్రదర్స్ కూడా విడిగా కేంద్ర పరిశీలకులను కలిశారు.