కెసిఆర్ ఉచ్చులో పడాలా?: టి-టిడిపి అయోమయం
రాజీనామాలు చేయాలని డెడ్ లైన్ పెడుతున్న జెఏసి రాజీనామాలకు అండగా ఉంటామని చెప్పడం మినహా అంతకు మించి హామీలు ఇవ్వడం లేదని టిటిడిపి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలు వస్తే తమకే సీటు కేటాయిస్తామనే హామీ జెఏసి నుండి లేదు. దీంతో వారు రాజీనామాలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కొనాలి? అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము రాజీనామాలు చేసినప్పటికీ టిఆర్ఎస్ నుండి ఎలాగూ సహకారం ఉండదు. జెఏసి సైతం కెసిఆర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నందున అక్కడి నుండి కూడా సహకారం వచ్చే పరిస్థితులు లేవని టిటిడిపి నేతలు భావిస్తున్నారు. అందుకే జెఏసి వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుందని అనుమానిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే కనుక టిఆర్ఎస్ తమపై పోటీ కూడా పెట్టవచ్చునని టిటిడిపిలో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన ఈ సమయంలో తాము రాజీనామాలు చేయకుంటే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగులుతామని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. జూలై 4వ తేదిన మిగిలిన పార్టీల కంటే ముందు టిడిపి నేతలే రాజీనామా చేసినందున టిడిపి పట్ల ప్రజల్లో కొంత సానుభూతి కనిపించింది. ఇప్పుడు కూడా అదే తరహా రాజీనామాలు చేస్తే టిఆర్ఎస్, జెఏసి సహకరించినా సహకరించక పోయినా ప్రజలలో విశ్వాసాన్ని చూరగొంటామని కొందరు భావిస్తున్నారు. రాజీనామాలు చేస్తే సానుభూతి కారణంగా టిఆర్ఎస్ వల్ల తమకు జరిగే నష్టం ఉండదని కూడా వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకోసం రాజీనామాలు చేయడమే ఉత్తమమని భావించినట్లుగా కనిపిస్తోంది.