ఆరు సుమోల్లో ఛేజింగు: 9 మంది దారుణ హత్య
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో మురగమళ్ల రోడ్డులోని బార్లహళ్లి వద్ద మామిడి తోటల సమీపంలో ఇద్దరు వ్యక్తులు చాలాసేపటి నుండి మాట్లాడుకోవడం గ్రామస్తులు గమనించారు. ఇంతలో మరో ముగ్గురు ఆటోలో అక్కడకు వచ్చి వారితో కలిశారు. వారి మీద అనుమానం వచ్చిన గ్రామస్తులు గ్రామంలోని మిగిలిన వారికి సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడకు వచ్చిన సమయంలో అక్కడకు మరో ఆరుగురు టాటా సుమోలో వచ్చి ఆ ఐదుగురితో కలిశారు. దీంతో మరింత అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తులు, గస్తీ బృందం వారిని చుట్టుముట్టారు. వారిని ప్రశ్నించారు. అందుకు వారు ఓ తోటలో నిధి దొరికిందని దాన్ని తీసుకు వస్తున్నామని చెప్పారు. నిధిపై గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు వారి సమాధానం సంతృప్తికరంగా లేక పోవడంతో గ్రామస్తులు వారిపై దాడికి దిగారు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు వారిని వెంటాడి రాళ్లతో, కర్రలతో వారిని తరిమారు. పదకొండు మందిని చితకబాదారు.
గస్తీ బృందం వారిని టాటా సుమోలో వెంబడించారు. ఆరుగులు ఎరువకోటలో మృతి చెందగా, మరో ముగ్గురు పంచనాళ్లపల్లిలో చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ ఇద్దరిలో ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లగా మరో వ్యక్తి తనది అనంతపురం జిల్లా అని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది అనంతపురం జిల్లా వాసులు కాగా, మరో ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. మృతి చెందిన వారిలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన రమేష్, రామంజి, నర్సింహారెడ్డి, లక్ష్మన్న, పెద్దిరెడ్డి, భాస్కర్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన చిన్నా, హరి, హన్మంతులు ఉన్నట్లుగా సమాచారం.