చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకే: సర్వే సత్యనారాయణ
తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తారని తమకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో సోనియా లేక పోవడం బాధాకరం అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ మా జన్మహక్కు అన్నారు. అయితే టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ వలె తాము ఆంధ్రా వారు బాగో అనడం లేదన్నారు. నాడు బలవంతంగా భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణ, ఆంధ్రను కలిపారన్నారు. ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ అన్నారు. ప్రజల భావోద్వేగాలను సోనియా అర్థం చేసుకున్నారని అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని అన్నారు.
హైదరాబాదు లేని తెలంగాణ మెడలేని మొండెం వంటిదన్నారు. ఉద్యమాలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ స్తంభించాయన్నారు. గూర్ఖాలాండు తరహా ప్యాకేజికి తాము వ్యతిరేకం అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఏమీ తేల్చకుండా ఇలా అలా చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలు ఇచ్చిన బిజెపి ఆనాడే పట్టించుకుంటే ఇబ్బంది ఉండక పోయేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అడ్డుపడిన తెలుగుదేశం పార్టీ ఆలోచనలో నేటికి మార్పు లేదన్నారు. చంద్రబాబు అప్పుడు ఇప్పుడూ అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ వాదులు ఏ పార్టీలో ఉన్నా అందరూ సోదరులే అన్నారు.