తెలంగాణపై సమయమే చిక్కలేదా: సుష్మాస్వరాజ్ ప్రశ్న
తెలంగాణను ఆంధ్రలో కలిపిన సమయంలోనే నాటి ప్రధాని నెహ్రూ ఇష్టం లేకుంటే విడిపోవచ్చునని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెబుతున్న కేంద్రానికి 2009 నుండి 2009 వరకు సరైన సమయమే రాలేదా అని ప్రశ్నించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు తెలంగాణ ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. కానీ తెలంగాణ ప్రజలను వంచిస్తూ 14 రోజుల్లోనే చిదంబరం మాట మార్చారని విమర్శించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు 2004 ముసాయిదాలో తెలిపిందని, ఆ తర్వాత కామన్ మినిమిమ్ ప్రోగ్రాంలో కూడా కలిపిందని అన్నారు.
610, గిర్ గ్లానీ, ముల్కీ రూల్సు ప్రవేశ పెట్టారని అయినప్పటికీ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయని సుష్మా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో తీవ్ర భావోద్వేగాలు ఉన్నాయని అన్నారు. డిసెంబర్ 9 ప్రకటన కీలక ఘట్టం అన్నారు. తెలంగాణలో తమకు ఒక్క ఎంపీ లేకున్నప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా తాము మద్దతు తెలుపుతున్నామని అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు చేసిన న్యాయాన్ని ఆ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచి పోరని ఎద్దేవా చేశారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు. దేశంలో ఇప్పటి వరకు రెండు రకాల నివేదికలు ఇవ్వడం కేవలం శ్రీకృష్ణకే చెల్లిందన్నారు. రహస్య నివేదిక ఇవ్వడాన్ని ఆమె ఖండించారు.
శ్రీకృష్ణ ఇచ్చింది ఏఐసిసి నివేదిక అని అన్నారు. రహస్య నివేదికలో మీడియా, భద్రత విషయాలపై చర్చించడం దారుణం అన్నారు. తెలంగాణ కోసం యాదిరెడ్డి అనే యువకుడు ఢిల్లీకి వచ్చి మరణించారని సభలో ఉద్వేగంగా చెప్పారు. తెలంగాణ అంశంపై చర్చలు పక్కన పెట్టి వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా బలిదానాలు వద్దు తెలంగాణ చూడటానికి బతికి ఉండండి అని సుష్మా స్వరాజ్ తెలుగులో తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. సుష్మా స్వరాజ్కు మద్దతుగా కాంగ్రెసు ఎంపీ సర్వే లేచి నిలబడగా కావూరి అడుగడుగునా అడ్డుపడ్డారు.