జగన్ పార్టీని వైయస్ విజయమ్మ నడపాల్సిందేనా?
జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడం వల్ల పార్టీపై ఏ విధమైన ప్రభావం ఉండదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ వంటి నాయకులు అంటున్నారు. తాము ప్రజల ముందుకు వెళ్తామని, ప్రజా కోర్టులో తేల్చుకుంటామని కొణతాల రామకృష్ణ, శోభా నాగిరెడ్డి అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు కుట్ర చేసి తనను కేసులో ఇరికించాయనే వాదనతో జగన్ ప్రజల ముందుకు వెళ్తారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే, ప్రస్తుత పరిణామం వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తప్పకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జగన్ వెంట నడుస్తున్న చాలా మంది ప్రస్తుత పరిణామంతో వెనక్కి తగ్గవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బద్ధ విధేయులు తప్ప మిగతా వారు పునరాలోచనలో పడతారని అంటున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు పలువురు ఇప్పటికే పునరాలోచనలో పడినట్లు కూడా సమాచారం. ఏమైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తుకు ఏ విధమైన డోకా ఉండదని పార్టీ నాయకులు భావిస్తున్నా ఏదో మేరకు ప్రభావం తప్పకుండా ఉంటుందనే అభిప్రాయానికే బలం చేకూరుతోంది.