జీవితాన్ని ముగించాలనుకున్న అన్నా హజారే ఇలా....
నేడు అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రతీకగా నిలిచారు. తన పోరాటాన్ని ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు. నేడు ఆయనకు భారత ప్రజలందరి మద్దతు లభిస్తోంది. దేశాన్నే ఆయన కదిలించారు. భారత సైన్యంలో ఆయన 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఇండో- చైనా యుద్ధం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సైన్యంలో చేరారు. 1978లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్కు తిరిగి వచ్చారు. అప్పుడు ఆయనకు 39 ఏళ్లు.
కరువుతో తన గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా చూశారు. దాంతో వర్షాధార జలం ఆదాకు చర్యలు చేపట్టారు. దాంతో ఆ మోడల్ విలేజ్గా ఆ గ్రామం ప్రపంచ చిత్ర పటం మీద చోటు చేసుకుంది. అన్నా హజారే పోరాటం ద్వారా గ్రామానికి విద్యుత్, పాఠశాలలతో పాటు రైతుల సంక్షేమానికి పథకాలు వచ్చాయి. అక్కడి నుంచి ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. గ్రామీణాభివృద్ధికి ఆటంకంగా మారిన అవినీతిపై పోరాటాన్ని ప్రారంభించారు. భ్రష్టాచార్ విరోధి జన్ ఆందోళన్ (అవినీతి వ్యతిరేక ప్రజా పోరాటం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన రాజకీయ నాయకులపై ఆయన గురి పెట్టారు.
హజారే పోరాటాన్ని రాజకీయ నాయకులు శరద్ పవార్, బాల్ థాకరే బ్లాక్ మెయిల్గా అభివర్ణించిన సందర్భాలున్నాయి. 1995 - 1996లో హజారే పోరాట ఫలితంగా సేన - బిజెపి ప్రభుత్వం ఇద్దరు అవినీతి మంత్రులకు ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది. 2003లో కాంగ్రెసు - ఎన్సిపి ప్రభుత్వం నలుగురు మంత్రులపై దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన నాలుగు రోజుల దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు వల్ల అన్నా హజారేను ఆషామాషీగా తీసుకోలేమని ప్రభుత్వం గ్రహించింది. ఫలితంగా లోక్పాల్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, హజారే కోరినవిధంగా ఆ బిల్లు లేదు. దీంతో ఆయన రెండోసారి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి మరింతగా ఇరకాటంలో పడింది.