రామోజీపై సాక్ష్యాలున్నాయి: జగన్ వర్గ ఎమ్మెల్యేలు
ఒక సామాన్యుడు వేసిన కేసులో చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిబిఐ విచారణపై చంద్రబాబు స్టే మాత్రమే తెచ్చుకున్నారని, అది ముగిసిపోలేదని ఆయన అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్పై సిబిఐ దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు, రామోజీ రావు కుమ్మక్కయి జగన్ను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయి జగన్పై కక్ష సాధిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా జగన్ ఆస్తులపై అత్యంత వేగంగా దాడులు చేయడమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడానికి నిదర్శనమని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్లో చంద్రబాబుకు, మంత్రులకు స్థలాలు ఉన్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబును, వైయస్సార్ మంత్రి వర్గ సభ్యులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ కుట్ర కారణంగా కేసులు వేయడం వల్లనే స్టే కోసం జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ వ్యాపార దక్షత వల్లనే చాలా మంది పెట్టుబడులు పెట్టారని, జగన్పై కేసుల విషయంలో న్యాయవ్యవస్థపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అవసరమైనప్పుడు తాము రాజీనామాలు చేస్తామని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పారు.