జగన్ వర్గంలో బీటలు, రాతపూర్వక హామీకి ఎమ్మెల్యేల పట్టు
శాసనసభ్యుల షరతులపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి రాజీనామాలు చేయకపోవడంపై కూడా ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. తాను హైదరాబాదు వచ్చేలోగా ఆ ముగ్గురు కూడా రాజీనామాలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ కోసం చేసిన రాజీనామాలు తిరస్కరణకు గురైనందున తిరిగి రాజీనామాలు చేయాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం రాజీనామాలు చేస్తే తాము తమ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. భూవివాదాలను తేల్చాలని, ఆర్థిక సహాయం అందించాలని శాసనసభ్యులు గొంతెమ్మ కోరికలు విప్పుతున్నట్లు చెబుతున్నారు. పైగా, మరో ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా చాలా మంది శాసనసభ్యులు సిద్ధంగా లేరని చెబుతున్నారు.