మేకపాటి రాజీనామా, మరిన్ని రోజుల తర్వాత సబ్బం
ఈ వర్షాకాల సమావేశాలే తాను పాల్గొనే చివరి సమావేశాలని సబ్బం హరి చెప్పారు. తాను లోకసభ సమావేశాలు ముగిసే లోగా రాజీనామా చేస్తానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరననగా తాను రాజీనామా చేసినట్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి వైయస్ జగన్మోహన్ రెడ్డినే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా బద్నాం చేయాలని చూస్తున్నాయని ఆయన విమర్సించారు. వైయస్ జగన్ కేసులో సిబిఐ అత్యంత వేగంగా దర్యాప్తును చేపట్టడాన్ని బట్టే కుట్ర జరుగుతోందని అర్థమవుతోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు.
రాజీనామా చేసిన తర్వాత జరిగే ఎన్నికల్లో తాము ఓడిపోతే జగన్ అవినీతిపరుడని అంగీకరిస్తామని సబ్బం హరి అన్నారు. తాము జగన్ను బలపరుస్తున్నామని ఆయన చెప్పారు. జగన్ బయటకు వెళ్తే కాంగ్రెసు గందరగోళంలో పడుతుందని కనీసం యాభై సార్లు చెప్పానని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కచ్చితంగా గందరగోళంలో ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఒకే వైఖరిపై ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి వంటివారు వైయస్ మరణించిన తర్వాత ఏం మాట్లాడారో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. మరో వారం రోజులు ఆగాలని వైయస్ జగన్ తనకు చెప్పారని, దాంతోనే ఆగానని ఆయన చెప్పారు.