కృష్ణా జిల్లాలో చంద్రబాబు వర్సెస్ వైయస్ జగన్
ఒకే జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా రాజకీయ వాతావరం ఒక్కసారిగా వేడెక్కింది.
జగన్ పదిరోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న తన ఓదార్పు యాత్రలో చంద్రబాబు అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రెండెకరాల ఆసామి అన్ని ఆస్తులు ఎలా సంపాదించాలో తెలపాలని జగన్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కై తనను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే జగన్ టూర్ జిల్లాలో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఓదార్పు పూర్తి కాకపోవడంతో కొనసాగుతోంది. కాగా సుప్రీం కోర్టులో చుక్కెదురయిన అనంతరం జగన్ ఉధృతి తగ్గినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు గురువారం మధ్యాహ్నం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా విజయవాడకు వెళ్లారు.
విజయవాడలో నాలుగు ప్రాంతాలలో అవినీతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు సైతం జగన్ అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. యువతరమే అవినీతికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిస్తున్నారు. ఇద్దరూ అవినీతి అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై జగన్, జగన్ అవినీతిపై చంద్రబాబు విమర్శలు చేసుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, జగన్ టూర్ల కారణంగా టిడిపి, వైయస్సార్సీ పార్టీ కార్యకర్తల్లో జోరు కనిపిస్తోంది.