జగన్ ఎఫెక్ట్: కాంగ్రెసుపై ఎంపి సాయి ప్రతాప్ నిరసన
వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదని సాయి ప్రతాప్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పదవుల కోసం కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. తప్పులు చేసినవారికి శిక్షలు పడాల్సిందేనని, అయితే మరణించిన వ్యక్తిని తక్కువ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దొంగగా చిత్రీకరిస్తున్నారని, ఓ మిత్రుడిగా దాన్ని తాను తీవ్రంగా నిరసిస్తున్నానని ఆయన అన్నారు.
ప్రధాని ప్రశంసలు అందుకున్న ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినవేనని ఆయన అన్నారు. వైయస్సార్ చలువ వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. వ్యాపారం వేరు, రాజకీయం వేరని ఆయన అన్నారు.