జగన్పై కెసిఆర్ మెతక వైఖరి వెనక బిజెపి వ్యూహం
కర్ణాటకలో కాంగ్రెసును దెబ్బ తీసిన బిజెపి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను దెబ్బ తీయడానికి ఓ వైపు వైయస్ జగన్ను, మరో వైపు కెసిఆర్ను చేరదీయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు ఘన విజయం సాధిస్తుందనే అంచనాలో బిజెపితో పాటు తెరాస కూడా ఉంది. సిబిఐ దర్యాప్తు, వైయస్ జగన్ అరెస్టు ఎలా ఉన్నా వైయస్సార్ కాంగ్రెసు గెలుస్తుందని కెసిఆర్ నమ్ముతున్నారు. ఇదే నమ్మకంతో బిజెపి ఉంది. ఇటు తెలంగాణలో తెరాస విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
సీమాంధ్రలో వైయస్ జగన్, ఇక్కడ తాము గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సులభమవుతుందని, రెండు పార్టీలు కూడా కేంద్రంలో బిజెపికి మద్దతిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం ఎలాగూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నికల్లోగా నడుం బిగించబోదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం వ్యతిరేకంగానే ఉందని కెసిఆర్ భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణలో ఆ పార్టీకి విజయం సాధ్యం కాదని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా మట్టి కొట్టుకుపోతుందని అంచనాలు వేస్తున్నారు. అందుకే, తెరాస నాయకులు తెలుగుదేశం పార్టీపై ఎక్కువగా విమర్శలు సంధిస్తున్నారు.
ఎమ్మార్ వ్యవహారంలో కూడా చంద్రబాబునే వారు తప్పు పడుతున్నారు. చంద్రబాబు తెలంగాణలో జరిపిన భూకేటాయింపులపై, ప్రభుత్వ సంస్థల దారాదత్తంపై కెసిఆర్కు చెందిన టి టీవీ చానెల్ వార్తాకథనం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. తన వ్యూహంలో భాగంగానే క్లిష్ట సమయంలో బిజెపి అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ జగన్ను వెనకేసుకొస్తూ మాట్లాడారని అంటున్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు తెలంగాణ విషయంలో కెసిఆర్ వెంటే నడుస్తున్నారు.