సత్యసాయి ట్రస్టు నివేదికపై చర్యలు తూతూ మంత్రం!
బస్తాల కొద్దీ పత్రాలను పంపడంతో వాటిని పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ పత్రాలను పరిశీలించిన కమిటీ అందులో ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికీ సరైన, సంతృప్తికరమైన సమాధానం లభించలేదని గుర్తించినట్లు తెలిసింది. ట్రస్టుకు సంబంధించిన పలు విషయాలతో పాటు ప్రభుత్వం అడిగిన వాటికి అందులో సమాధానం లేదని భావించిన కమిటీ మరికొన్ని అనుబంధ ప్రశ్నలు వేయాలని అందుకు ట్రస్టుకు మరోసారి నోటీసులు జారీ చేయాలని వారు భావించినట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఓ నివేదిక తయారు చేసి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి సమర్పించారు. అది చివరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేరింది.
మరోసారి నోటీసులు జారీ చేయాలంటే సిఎం నిర్ణయం తీసుకోవాలి. అయితే నివేదిక వచ్చినప్పటికీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లుగా కనిపిస్తోంది. ఆదాయపన్ను శాఖ నుంచి కూడా ఎలాంటి కార్యాచరణ లేనట్లుగా కనిపిస్తోంది. ఇలా మరోసారి నోటీసులు జారీ చేసి ట్రస్టును మరోసారి బజారుకీడ్చకుండా ఉండేందుకు ఓ మంత్రి, ఓ రాష్ట్ర గవర్నర్ ఉన్నట్లుగా కథనంలో పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఒత్తిళ్లలో భాగంగానే ప్రభుత్వం కమిటీ సిఫార్సులపై మౌనం వహిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.