సాయి స్టోరీ: వైయస్ రాజారెడ్డి నుంచి జగన్ దాకా
జగన్ అక్రమాస్తుల కేసులో వేణుంబాక విజయ సాయి రెడ్డి రెండో నిందితుడు. ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి. వీరిది వ్యవసాయ కుటుంబం. చెన్నైలో సీఏ పూర్తి కాగానే చెన్నైలోని పేనంపేట క్రాస్రోడ్డులో ఓ చిన్నగదిలో ఆడిటర్గా జీవితాన్ని ప్రారంభించారు. 1976లో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట రామసుబ్బారెడ్డి కుమార్తె సునందను పెళ్లి చేసుకున్నాడు. దీంతో కడప జిల్లాతో సంబంధం ఏర్పడింది. అదే సంబంధం ఆయనను వైఎస్ రాజారెడ్డితో పరిచయానికి దారి తీసింది. రాజారెడ్డి 1980లలో బరైటీస్ గనులను సొంతం చేసుకున్నారు. ఈ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల్లో విజయ సాయి సలహాలు తీసుకునే వారు. తర్వాత ఆయననే పూర్తి స్థాయి ఆడిటర్గా నియమించుకున్నారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికే అంకితమయ్యారు.
రాజారెడ్డి అనంతరం రాజశేఖర రెడ్డి కూడా పూర్తిగా విజయ సాయినే నమ్ముకున్నారు. అన్నింటికీ వైయస్ రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డి పేరే చెప్పేవారని ఓ తెలుగు దినపత్రిక రాసింది. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే విజయ సాయిని టీటీడీ బోర్డులో సభ్యుడిగా నియమించారు. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా కూడా నామినేట్ అయ్యారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో సొంత కుమారుడైన జగన్ను కూడా వైఎస్ పట్టించుకునే వారు కాదు. వైఎస్ మరణానంతరం జగన్ అనివార్యంగానో, అవసరంగానో పూర్తిగా విజయ సాయిపై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించి ఏ కంపెనీ ఎక్కడ, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్లాయి, ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయే విషయం సాయిరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆ పత్రిక రాసింది.