అమెరికాకు సెప్టెంబర్ 11 టెన్షన్, చొరబడ్డ ముగ్గురు
"9/11 పదో 'వార్షికోత్సవాన్ని' కళ్లు చెదిరే దాడుల'తో జరుపుకోవాలని అల్ కాయిదా కొత్త చీఫ్ అల్ జవహరి నిర్ణయించుకున్నారు. బిన్ లాడెన్ మరణానికి తగిన ప్రతీకారం తీసుకోవాలని తీర్మానించారు. ఈ బాధ్యతను ముగ్గురికి అప్పగించాడు'' అని పాక్ వాయవ్య ప్రాంతానికి చెందిన సీఐఏ ఇన్ఫార్మర్ ఒకరు సమాచారం అందించారు. దీంతో ఆ ముగ్గురి కోసం అమెరికా భారీ స్థాయిలో వేట ప్రారంభించింది. ఆ ముగ్గురూ అరబ్ సంతతికి చెందిన వారేనని... అరబ్బీతోపాటు ఇంగ్లీషుకూడా ధారాళంగా మాట్లాడగలరని భావిస్తున్నారు. ముంబై నుంచి న్యూయార్క్దాకా అనేక దేశాల్లోని అనేక నగరాలను అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తం చేశారు.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అణు కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. న్యూయార్క్లోని ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన కమెండోలు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. అన్ని ప్రధాన చౌరస్తాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ... న్యూయార్క్లోని గ్రౌండ్ జీరోతోపాటు వర్జీనియా, పెన్సిల్వేనియాలలో స్మారక కార్యక్రమాలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మూడు ప్రదేశాలను ఒబామా సందర్శిస్తారు. కాగా గడిచిన దశాబ్దకాలం అమెరికాకు ఎంతో కష్టకాలమని, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేశామని, అంతర్జాతీయంగా భాగస్వాములను పెంచుకున్నామని, అల్కాయిదాకు ఓటమి బాట చూపించామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతినుద్దేశించి అన్నారు.