వ్యాట్తో మండిపోనున్న ధరలు, రాబడి వేయి కోట్లు
రాబడిని మరింతగా పెంచుకోవడం కోసం ప్రజలు విరివిగా ఉపయోగించే అనేక రకాల వస్తువులపై పన్ను రేటును ప్రభుత్వం ఒక శాతం మేర పెంచుతూ మంగళవారం ఉత్తర్వు (నెం.1718) జారీ చేసింది. వ్యాట్ చట్టంలోని నాలుగో వర్గీకరణలో మొత్తం 125 ఎంట్రీల్లో 4 శాతం పన్ను రేటు వర్తించే వస్తువుల వివరాలు పొందుపరచి వున్నాయి. వీటన్నింటిపైనా బుధవారం నుంచి 5శాతం పన్ను పడుతుంది. పలు రాష్ట్రాలు ఈ పన్ను రేటును ఇప్పటికే పెంచాయని, రాష్ట్రమే తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఆలస్యంగా ఆమోదాన్ని తెలిపిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాలు వసూలు చేసుకునే సీఎస్టీని కేంద్రం 4 నుంచి 2 శాతానికి కుందించడంవల్ల రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్లకు పైగా రాబడి లోటు ఏర్పడుతోంది. సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్నును ప్రస్తుత 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఏటా రూ.400 కోట్ల ఆదాయం వస్తోంది. పన్ను పెంపువల్ల రూ.50 కోట్లు అదనంగా రావచ్చని అంచనా.
మందులు, బియ్యం, పప్పులు, వంటనూనెలు, టీ, వంటగ్యాస్, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి, ఆగర్బత్తీ, అగ్గిపెట్టెలు, ఇనుము, పరిశ్రమల ముడి పదార్ధాలు, యంత్ర పరికరాలు, హస్తకళలు, రోల్డుగోల్డు వస్తువులు, కిరోసిన్ స్టౌలు, పీడీఎస్ కిరోసిన్, గొడుగులు, అన్నిరకాల ప్యాకింగ్ సామాగ్రి, పేపర్, న్యూస్ప్రింట్, బ్రాండెడ్ బ్రెడ్, అప్పడాలు, ఎల్పీజీ, సీఎన్జీ కిట్స్్, వైద్య పరికరాలు, పశువుల మందులు, డీజిల్ జనరేటరు, ఐటీ ఉత్పత్తులు, ఇటుకలు, బీడీ అకులు, సైకిళ్లు తదితరాల ధరలు గణనీయంగా పెరగనున్నాయి.