సిబిఐ భయం, వాటా ఇస్తానంటూ దిగొచ్చిన రహేజా
కాగా, రహేజా బోర్డు తీర్మానంపై సొలిసిటర్ జనరల్తోపాటు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. రహేజా ప్రతిపాదనను సమగ్ర నివేదిక రూపంలో సీఎం కిరణ్ ముందు పెట్టి ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు. రహేజా బోర్డు తీర్మానం చెల్లుబాటు ఏ మేరకు ఉంటుందనే అంశంపై కూడా పరిశీలన చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రహేజా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఏపీఐఐసీ అధికారులు తమ వాటా పునరుద్ధరణ అంశంపై ఆ భేటీలో గట్టిగా మాట్లాడారు.
రహేజా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైకి చెందిన సంస్థ. హైదరాబాద్లో మైండ్ స్పేస్ పేరిట ప్రాజెక్టును నెలకొల్పాలని తలపెట్టింది. ఇందుకు మాదాపూర్లో వందల కోట్ల విలువైన 110 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. 2003లో చంద్రబాబు హయాంలో రహేజాకే అనుకూలమైన నిబంధనలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వైఎస్ ప్రభుత్వం వచ్చాక మరిన్ని మినహాయింపులు లభించాయి. వాస్తవానికి, రహేజాతో ఒప్పందం కుదిరే నాటికేహైటెక్ సిటీ వచ్చింది. మాదాపూర్లో ఆనాడు ఎకరా ధర రూ.2 కోట్ల వరకు ఉంది. అయినా ఏపీఐఐసీ 110 ఎకరాల భూమిని ఎకరా రూ.50 లక్షల లెక్కన కేటాయించింది.