మూర్ఖత్వం వద్దు: ముఖ్యమంత్రికి కెసిఆర్ సూచన
స్వామిగౌడ్ అరెస్టుపై న్యాయస్థానానికి వెళ్తామని ఆయన అన్నారు. అరెస్టు చేసి విడుదల చేసినంత మాత్రాన అయిపోదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, డిజిపి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమం మరింత ఎగిసిపడుతుందని ఆయన అన్నారు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారని, ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని ఆయన సూచించారు. తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవసరమైతే మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన అన్నారు.
పోలీసుల తీరు మేకల మంద మీద తోడేళ్లు పడినట్లుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామి గౌడ్ అన్నారు. తన ఆరెస్టును వ్యతిరేకించిన తెలంగాణ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఎవరేం చేసినా సకల జనుల సమ్మె ఆగదని, తెలంగాణ సాధించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగితే తెలంగాణ అగ్నిగుండమవుతుందని ఆయన హెచ్చరించారు. పోలీసులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని, ఇలా ఎంత మందిని అరెస్టు చేశారని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకుల తొత్తుగా పనిచేస్తున్న పోలీసులు తమ తీరు మార్చుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించాలని తెలంగాణ నగారా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఐక్యతేమిటో ఈ రోజు తెలిసిందని ఆయన అన్నారు. స్వామిగౌడ్ను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బిజెపి నేత సిహెచ్ విద్యాసాగర రావు డిమాండ్ చేశారు.