టిటిడిపికి సమ్మె షాక్, జెఏసికి రేవంత్ రాజీనామా లేఖ
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి తాను ఎప్పుడో రాజీనామా చేశానని దానిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించలేదన్నారు. మీరే ఆమోదింప చేయండని తన రాజీనామా లేఖను ఐకాస నేతలకు ఇచ్చారు. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా పార్లమెంటులో ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం అన్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. సంకుచిత భావంతో ఆలోచించడం సరికాదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఇదే ఆఖరి విమోచన దినం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలని డిమాండ్ చేశారు.