అంబటి రాంబాబుపై ఆంధ్రజ్యోతి మరో బాంబు
గుంటూరులోని ఓ జూట్ మిల్లు 1990లలో ఖాయిలా పడటంతో మిల్లు యాజమాన్యం 1994లో పూర్తిగా చేతులెత్తేసి లాకౌట్ ప్రకటించిందట. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. వీరి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొత్త యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సయోధ్య కుదిర్చింది. మిల్లు తిరిగి ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం ఆ మిల్లులో 60 శాతం యాజమాన్యానికి, 40 శాతం కార్మికులకు వాటా ఉంటుంది. అంతేకాదు, మిల్లు ఆస్తులన్నింటిపైనా కార్మికులకు హక్కు లభించింది. ఆ తర్వాత 2008లో సర్వే నెంబర్ 1416లోని రెండున్నర ఎకరాలను విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. అప్పట్లో ఈ భూమి మార్కెట్ విలువ దాదాపు 30 కోట్లు. అప్పటికే అంబటి రాంబాబు ఏపిఐఐసి చైర్మన్గా భారీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. వైయస్కు సన్నిహితుడిగా ప్రభుత్వ భూములను పందేరం చేసే భూయజ్ఞంలో కీలక భాగస్వామిగా మారారు.
దీపం ఉండగానే తానూ ఇళ్లు చక్కబెట్టుకోవాలనుకున్నారు. గుంటూరులోని ఆ మిల్లు భూములపై కన్నేశారు. 30 కోట్ల విలువైన భూమి కేవలం రెండున్నర కోట్లకే అంబటి పరమైంది. ఈ భూమిని రూ.30 కోట్లకు విక్రయించి ఉంటే కార్మికుల వాటాగా రూ.12 కోట్లు దక్కేవి. కానీ అంబటికి 2.5 కోట్లకే కట్టబెట్టడంతో కార్మికులకు కోటి రూపాయలు మాత్రమే వచ్చాయట. అటు మిల్లు యాజమాన్యం, ఇటు అంబటి రాంబాబు తాము ఎలాంటి అక్రమాలు చేయలేదంటున్నారు. భూమిని అమ్మేందుకు మాకు బిఐఎఫ్ఆర్ అనుమతి ఉంది అని యాజమాన్యం చెబుతోందని సమాచారం. కానీ... అక్రమాలు జరగడం ముమ్మాటికీ నిజమని, ఏపిఐఐసి చైర్మన్గా సంపాదించిన అక్రమ సొమ్ముతోనే అంబటి ఈ భూమి కొన్నారని కార్మికులు చెబుతున్నారట. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అంబటి రాంబాబు తమ్ముడు ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్లో 1113 చదరపు గజాల ప్లాటును రూ.55.65 లక్షలకు కొనుగోలు చేశారు. తద్వారా ఇక్కడ ప్లాట్లు, విల్లాలు కొన్న సినీ, రాజకీయ ప్రముఖుల చెంతన చేరారు. ప్లాటు విలువను బయటికి రూ.55.65 లక్షలుగా చెబుతున్నా అసలు ధర వేరే ఉందనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే సిబిఐ విచారణ జరుపుతోంది. మొత్తానికి అందులో ప్లాటు పొందడం సాధారణ వ్యక్తులకు సాధ్యంకాని పరిస్థితి. గుంటూరులో మామూలు కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న మురళీకృష్ణకు అంత విలువైన ప్లాటు కొనే ఆర్థిక స్థోమత లేదని సిబిఐ కూడా భావిస్తోందట. అప్పట్లో ఏపిఐఐసి చైర్మన్గా ఉన్న అంబటి ద్వారానే ఈ లావాదేవీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.