తెలంగాణ రైతులపై ముఖ్యమంత్రి కుట్ర: హరీష్ రావు
సీమాంధ్రలోని ఒక్క పరిశ్రమకు కూడా విద్యుత్తు కోత విధించడం లేదని, తెలంగాణలో మాత్రం ఆరు గంటలు మాత్రమే విద్యుత్తు ఇస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని రైతులకు ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఇళ్లలో విద్యుత్ లేకపోయినా ఫరవాలేదు గానీ వ్యవసాయానికి కావాలని ఆయన అన్నారు. తెలంగాణలోని పంటలు ఎండిపోతున్నా తెలంగాణ మంత్రులు పదవుల్లో ఎలా కొనసాగుతున్నారని, ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఒక్క ఎకరం పంట ఎండిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో నిండా నీళ్లు ఉన్నా జలవిద్యుదుత్పత్తి జరపడం లేదని, జల విద్యుదుత్పత్తికి కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్తు కోత ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి ఇంటిని, విద్యుత్తు సౌధను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.