విభజన కేక్ కట్ చేయడమంత సులభం కాదు: అసదుద్దీన్
సమ్మె వల్ల అన్ని వర్గాలూ నష్టపోతున్నాయని, హైదరాబాద్లో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది దినసరి కూలీలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల బీజేపీకి మాత్రమే లాభమన్నారు. అంత మాత్రాన ఆ పార్టీని చూసి తామేమీ బెదరడం లేదని స్పష్టం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక సీటుకు మాత్రమే పరిమితమైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిని ఇదివరకే శ్రీకృష్ణ కమిటీకి స్పష్టం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ నాయకులు డెడ్లైన్లు పెట్టడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలు కొందరు నెల రోజుల్లో తెలంగాణ వస్తుందని, రెండు నెలల్లో వస్తుందని అనడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. సకల జనుల సమ్మెలో హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తే మజ్లిస్ నాయకులు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సందర్భంలో తాము తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.