తెలంగాణ తాజా ప్రతిపాదన అంగీకారయోగ్యమేనా?
అనంతపురం, కర్నూలు జిల్లాలతో కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్, అసదుద్దీన్ కూడా సుముఖంగానే ఉన్నారు. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ భిన్నస్వరం వినిపిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు చిత్తూరు, కడప జిల్లాలున్నాయి. రెండు జిల్లాలు తెలంగాణలోకి వస్తే, మరో రెండు జిల్లాలు ఆంధ్రలోకి వెళ్తాయి. దీనికి రాయలసీమ ప్రాంత నాయకులు ఇష్టపడకపోవచ్చు. అయితే, కృష్ణా నదీజలాలపై రాయలసీమ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగులు జలాల వాడకం పేరుతో నికరజలాలను వాడుకోవడానికి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఆ జలాలను ఖాయం చేసుకోవడానికి మాత్రమే వారు ఎక్కువగా ప్రయత్నించవచ్చు.
అయితే, కాంగ్రెసు అధిష్టానం రాయబారిగా మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ తన వద్దకు తెలంగాణ కోసం ప్రతిపాదనలను తెచ్చారని కెసిఆర్ చెబుతున్న మాటలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్ ప్రకటనను అసదుద్దీన్ ఖండించారు. తాను తెలంగాణపై గానీ హైదరాబాదుపై గానీ కెసిఆర్తో మాట్లాడలేదని, కేవలం సచార్ కమిటీ నివేదికపైనే మాట్లాడానని ఆయన అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి తెలంగాణ ఏర్పడుతుందని చెబుతూ కెసిఆర్ నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కెసిఆర్ అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు, తెరాసకు మధ్య జరిగిన ఒప్పందమేమిటో కెసిఆర్ బయటపెట్టాలని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
కాంగ్రెసు నాయకులు కూడా కెసిఆర్ మాటలను ఖండిస్తున్నారు. ఇంకా చర్చలు జరుగుతున్న క్రమంలో అటువంటి ప్రతిపాదన ఎలా పెడుతామని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదిక సమర్పించాల్సి ఉంది. కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికి వరకు ఏ విధమైన నిర్ణయానికి రాలేదని, అందువల్ల కెసిఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టే ప్రసక్తే ఉండదని అంటున్నారు.