బాబునే ఇక్కడి నుండి పంపిస్తాం: టిడిపి ఎమ్మెల్యే జైపాల్
రాజీనామా చేసేందుకు వెనక్కి పోయిన కాంగ్రెసు నేతలు పిరికి పందలని విమర్శించారు. తెలంగాణ బూచి చూపి కావాలనే వారు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలు బహిష్కరిస్తామనే అంశంపై చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటన ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు.
ఐక్య ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తోడ్పాటునందించాలన్నారు. టిడిపి నేతలపై టిఆర్ఎస్ నేతల దాడి సరికాదన్నారు. ఎపికి కాంగ్రెసు శనిలా దాపురించిందన్నారు. కాగా గతంలోనూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సమయంలో తెలంగాణ టిడిపి నేతలం రాజీనామాలు చేసి బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేమని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బాబును గెంటి వేస్తామని ప్రకటించడం విశేషం.