కెసిఆర్ ప్రతిపాదనపై రాయలసీమ నేతల ఫైర్
రాష్ట్ర విభజనపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. రాయలసీమ ప్రజలతో చర్చించిన తర్వాత రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చించడానికి త్వరలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని, తమ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను కలుస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ కెసిఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర సరిహద్దులు మార్చడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. అనంతపురం జిల్లా జోలికి వస్తే ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు.
చిత్తూరులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, కడపలో వైయస్సార్సీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్రలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు ఉన్నందునే ఆ జిల్లాలను కెసిఆర్ వద్దంటున్నారని కాంగ్రెసు నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. కర్నూలు, అనంతపురంలో సిఎం పదవికి పోటీ ఎవరూ లేనందునే ఆయన ఆ జిల్లాలను ఎంచుకున్నారని విమర్శించారు. కెసిఆర్ ప్రకటనపై అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తామని చెప్పారు.