తెలంగాణకు ఆ ముగ్గురు నేతలూ అడ్డమేనా?
తెలంగాణపై పార్టీ వైఖరి ప్రకటించకుండా తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ, ఎన్సీపి నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్డుల్లాలతో చర్చలు జరిపే నెపంతో, వారిని ఒప్పించే నెపంతో తెలంగాణ అంశాన్ని మరింత కాలం లాగాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ముగ్గురు నేతలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. సంప్రదింపులంటూ ప్రారంభమైతే వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. వారిని ఒప్పించే ప్రయత్నాలంటూ తెలంగాణ అంశాన్ని నాన్చడానికి కాంగ్రెసు అధిష్టానం ఉద్దేశించిందని అంటున్నారు.
ఆ ముగ్గురు నేతలు కూడా తెలంగాణను వ్యతిరేకించడానికి తమ రాష్ట్రాల్లోని పరిస్థితులే కారణమని అంటున్నారు. మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా నలుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే విదర్భలో అగ్గి రాజుకునే అవకాశం ఉంది. గూర్ఖాలాండ్ సమస్యను పరిష్కరించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మళ్లీ ముందుకు వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు నాయకురాలు మమతా బెనర్జీ భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మరిన్ని కొన్ని కూడా రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లున్నాయి. జమ్మూ కాశ్మీర్లోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉంది. దాంతో ఫరూఖ్ అబ్దుల్లా కూడా తెలంగాణను వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణకు ఆ ముగ్గురు నేతల వైఖరిని అడ్డువేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.