రాష్ట్రపతి పాలన దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన?
తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వాటిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగులో పెట్టారు. వాటిని ఆయన ఎంతో కాలం పెండింగులో పెట్టలేరనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు ఒత్తిడి తట్టుకోలేక ఒక్కరొక్కరే గానీ తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే మూకుమ్మడిగా గానీ రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో వాటిని కూడా స్పీకర్ ఆమోదించాల్సి వస్తే తీవ్ర సమస్య ఎదురు కావచ్చు.
ప్రజారాజ్యం పార్టీ విలీనం వల్ల లభించిన 17 మంది శాసనసభ్యులు, ఏడుగురు మజ్లీస్ శానసభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి డోకా ఏమీ లేదు. కానీ కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేస్తే, వాటిని ఆమోదించాల్సి వస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. మధ్యంతర ఎన్నికలకు వెళ్తే కాంగ్రెసుకు ఓటమి ఖాయం. అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడమే మేలనే దిశగా కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.