కోదండరామ్పై మంద కృష్ణ మాదిగ డైరెక్ట్ వార్
ముస్లిం నేత మహమూద్ సమ్మె విరమణ ప్రకటన చేస్తే తెలంగాణ ద్రోహమని చెప్పి, అదే ఇద్దరు రెడ్లు కలిసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటిస్తే అది న్యాయం ఎలా అవుతుందన్నారు. ఆర్టీసి సమ్మె విరమణకు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని ఆయన కోదండరామ్ను అడిగారు. ఆర్టీసీలో సమ్మె వల్ల పేదలకు కష్టాలు, కోదండరాం, కేసీఆర్, వ్యాపారులకు లాభాలు మిగిలాయని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మె నుంచి సినిమా థియేటర్లు, బ్రాందీ షాపులు, ప్రైవేటు బస్సులను ఎందుకు మినహాయించారో కోదండరాం, కేసీఆర్ బహిరంగ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిని మినహాయించి ఎంత దండుకున్నారని ప్రశ్నించారు.
పేదలు విద్యకు దూరమైతే కోదండరాం, కేటీఆర్, కవిత, హరీశ్రావుల పిల్లలు మాత్రం చదువుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా వారు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కోదండరాం పిల్లలకు ఒక నీతి, పేదల పిల్లలకు మరో నీతా? అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ లక్ష్యమని రాజకీయ జేఏసీలో తీర్మానం చేస్తే కోదండరాంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంద కృష్ణ ప్రకటించారు.