దిమ్మ తిరిగి వివరణ ఇచ్చిన మంత్రి జానా రెడ్డి
ఉద్యమంలో ఒక అడుగు వెనక్కి, రెండు అడుగులు ముందుకు వెళ్లాలనే ఎత్తుగడలో భాగంగానే తాను సమ్మె వాయిదా వేయాలని సూచించానని ఆయన చెప్పారు. తాము కొన్ని పరిమితులతో తాము పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందు భాగాన ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన సమయంలో తాను ముందుండి వంద మందికిపైగా రాజీనామా చేయించడానికి తాను కృషి చేశానని, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ వచ్చిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తామని కొందరు మాట్లాడడం సరికాదని, దాన్ని కూడా తాము ఆవేదనతో మాట్లాడిన మాటలుగానే తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసును టార్గెట్ చేయడం సరి కాదని, తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు అగ్రభాగాన ఉంటుందని ఆయన చెప్పారు.
తాను తెలంగాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఆయన చెప్పారు. తాను 1989లోనే తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను పనిచేస్తున్నానని చేసిన విమర్శలు అపోహలు, అనుమానాలు మాత్రమేనని ఆయన అన్నారు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు అగ్రభాగాన ఉన్నవారికి ఊపిరి పోసింది కాంగ్రెసు నాయకులేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై జాతీయ స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ సాధనే తన లక్ష్యమని, అవసరం వచ్చినప్పుడు తాను తెలంగాణ కోసం ఎటువంటి త్యాగం చేస్తానో తెలుస్తుందని ఆయన అన్నారు.