తెలంగాణపై మాట తప్పం: డిసెంబర్ 9పై బొత్స
కాగా అంతకుముందు ఉదయం హైదరాబాదులో మాట్లాడిన ఆయన తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలు వినిపిస్తున్న నేతలు ఏ జెఎసిల్లోనూ పని చేయవద్దని ఆయన సూచించారు. ప్రజల మనోభావాలను పార్టీపరంగా మాత్రమే వినిపించాలని, ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ నేతలు వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి మాత్రమే వినిపించాలని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో కలిసి పనిచేయవద్దని ఉద్యమాలు చేయవద్దనేది పార్టీ విధాన నిర్ణయమని ఆయన చెప్పారు. సున్నితమైన తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, అందుకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు. సమ్మె విరమించడం వల్ల తెలంగాణ వాదం వెనక్కి పోయిందని, ఓడిపోయిందని అనుకుంటే పొరపాటని, అలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన అన్నారు. పట్టుదలను, ఐక్యతను చాటి చెప్పేందుకు, మనోభావాలను వ్యక్తం చేయడానికి సమ్మెను వాడుకోవాలే తప్ప సమ్మెతో రాష్ట్ర విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు.
కాగా తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెసు కట్టుబడి ఉంటుందని తాను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.