తెలంగాణ సకల జనుల సమ్మె విరమణ, చర్చలు సఫలం
అంతకు ముందు పరిణామాలు ఇలా సాగాయి - సమ్మె విరమణకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులతో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తెలంగాణ ఉద్యోగులు పెడుతున్న కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆప్షనల్ సెలవుల జీతభత్యాలపై ఇరు పక్షాల మధ్య పీఠముడి పడినట్లు తెలుస్తోంది. తాము సమ్మె చేసిన 42 రోజులను విధులు నిర్వహించినట్లుగా పరిగణించి జీతభత్యాలు చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చుననే ప్రభుత్వ ఉద్దేశంతో చర్చలు ముందుకు సాగలేదు. నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే, అందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సిద్ధంగా లేరు.
అలాగే, ఉద్యోగులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై కూడా ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరడం లేదు. కేసులను ఎత్తేయాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తుండగా, దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం అంటోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతల డిమాండ్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సితోనూ, ఆర్థిక శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం దిగి రావడంతో సమస్య పరిష్కారమైంది.