రణరంగం పోలవరం బస్సుయాత్ర, విద్యార్థుల అరెస్టు
పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మిగిలిన వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలవరం వద్దురా తెలంగాణ ముద్దురా, ఖబర్దార్ సీమాంధ్ర పెట్టుబడుదారుల్లారా అంటూ నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కడితే తమ గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని మేం కేవలం సైట్ చూడటానికి మాత్రమే వెళుతున్నామని తమకు మద్దతుగా వచ్చిన ఓయు జెఏసి, న్యాయవాదులకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్థానిక విద్యార్థులు హెచ్చరించారు.
అంతకుముందు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు భద్రాచలం నుంచి పోలవరం నుండి బస్సులో బయలుదేరారు. వీరికి పలువురు న్యాయవాదులు మద్దతు పలికారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ వారు వస్తే వారిని అడ్డుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఖమ్మం, పోలవరం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. జీలుగుమిల్లు పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. విద్యార్థులు అశ్వారావుపేట మీదుగా వస్తుండటంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
కాగా తెలంగాణ విద్యార్థులను జీలుగుమల్లి చెక్ పోస్టు వద్ద అడ్డుకోవడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖండించారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. సమైక్యంగా ఉందామని చెప్పే వారు అరెస్టు చేయించడం ఎంత వరకు సమంజసమన్నారు. రాజ్యాంగ బద్దంగా వెళ్లి చూసేందుకు వారికి హక్కు ఉందన్నారు.