వారి రాజీనామాలతో కాంగ్రెసుకు నష్టం లేదు: బొత్స
రాజీనామా చేసిన శాసనసభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించడానికి బొత్స సత్యనారాయణ ప్రయత్నించారు. తాను వెనక్కి వచ్చేది లేదని, ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని సోమారపు సత్యనారాయణ చెప్పారు. జూపల్లి కృష్ణారావు, రాజయ్య బొత్స సత్యనారాయణకు ఫోన్లో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ విజ్ఞప్తిని తోసిపుచ్చి తాము రాజీనామాలు చేసిన విషయాన్ని ముగ్గురు శాసనసభ్యులు కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.
ముగ్గురు శానససభ్యుల రాజీనామాలతో తమ పార్టీనికి నష్టం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. మొదటి ఆచితూచి మాట్లాడిన ఆయన ఆ తర్వాత గట్టిగానే వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు రాజీనామా చేశారని, తెలంగాణ కోసం కాదని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు.