జగన్, కెసిఆర్: కాంగ్రెసుకు కొరకరాని కొయ్యలు
అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు చెక్ పెట్టేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యూహరచన చేశారని, దాన్ని అమలు పెట్టడానికి సమాయత్తమయ్యారని వార్తలు వచ్చాయి జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించడానికి బొత్స ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. తద్వారా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులను భయపెట్టాలని కూడా ఆయన భావించినట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే, దానికి బ్రేక్ వేస్తూ తెలంగాణ అంశం ముందుకు వచ్చి అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు శాసనసభ్యుల వ్యవహారం బొత్స సత్యనారాయణకు కొరుకుడు పడని వ్యవహారంగా మారింది.
పరిస్థితి సద్దుమణగిందని భావిస్తున్న ప్రతి సందర్భంలోనూ వైయస్ జగన్ రూపంలో లేదా కెసిఆర్ రూపంలో కాంగ్రెసుకు గండం ముంచుకుని వస్తూనే ఉన్నది. ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెసు పార్టీ నాయకత్వానికి కొరుకుడు పడని కొయ్యలుగా మారారు. కాంగ్రెసు పార్టీని, ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనీయకపోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వీలు చిక్కితే ప్రభుత్వాన్ని కూల్చేసి మధ్యంతర ఎన్నికల సమరానికి ప్రాణం పోయాలని కూడా వారు భావిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన చిక్కుల్లో పడింది.