వైయస్ జగన్ ఆస్తుల కేసులో పెదవి విప్పని సిబిఐ
గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్కు 10,670 ఎకరాలను వైయస్సార్ ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించడమే కాకుండా దానికి వాడుకునేందుకు ఇనుప ఖనిజం గనులను కూడా ఇచ్చింది. బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభమయ్యే లోగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసుకునేందుకు కూడా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పనిచేసిందనే భావనతో ఉన్నారు. అంతేకాకుండా ఓఎంసిలో పెట్టుబడులు ఉన్న ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు జగన్ కంపెనీల చిరునామాలోనే ఉన్నాయి. ఇక్కడ అక్రమ గనుల సొమ్ము జగన్ కంపెనీల్లోకి చేరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, సిబిఐ ముందు జగన్ హాజరయ్యే తేదీని వాయిదా వేయాలని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన తిరుపతిలో జగన్ తన ముఖ్య అనుచరుడు బి. కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లికి హాజరు కావాల్సి ఉంది. దాంతో ఆ తేదీని వాయిదా వేయాలని సిబిఐని విజయసాయిరెడ్డి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో జగన్ తొలి విడత ఓదార్పు యాత్ర బుధవారం సాయంత్రం ముగిసింది. జగన్ నవంబర్ 3, 4 తేదీల్లో హైదరాబాదులో ఉంటున్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన జగన్ సిబిఐ ముందుకు రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.