ఎమ్మెల్యేల జిఎస్పిసి ముట్టడి, దిగొచ్చిన కిరణ్ ప్రభుత్వం
సముద్రంలోని కార్యకలాపాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. వేటకు ఆంక్షలు విధించడంపై వారు మండిపడుతున్నారు. రిగ్ల వల్ల సముద్రంలో మత్స్యసంపద కోల్పోవాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. మూడేళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతున్న వారు గత నలభై రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రిగ్ల ముట్టడికి యత్నించడంతో ప్రభుత్వం దిగొచ్చింది.
కాగా అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా బైరవపాలెం సమీపంలోని సముద్రంలో ఉన్న జిఎస్పిసి రిగ్గును ముట్టడించడానికి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సుమారు 500 పడవల్లో వేలాది మత్స్యకారులు బయలుదేరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు రిగ్ ముట్టడించడానికి వస్తున్నారని తెలుసుకొని భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులు, పోస్టుగార్డులు, ఆంధ్రా పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. సమీప ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. రిగ్ తీర ప్రాంతం నుండి 24 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. ఓ సమయంలో పోలీసులతో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. సుమారు 50 గ్రామాల్లోని మత్స్యకారులు పాల్గొన్నారు.