తాజా ప్రకటనలతో టి- కాంగ్రెసు నేతల్లో గుబులు
తెలంగాణ ఇవ్వబోమని తమ పార్టీ అధిష్టానం చెప్పితే తాము పార్టీకి రాజీనామా చేయడానికైనా వెనకాడబోమని కాంగ్రెసు వీర తెలంగాణవాదులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. మరింత మంది తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శాసనసభ్యులే కాకుండా పార్లమెంటు సభ్యులే కాకుండా పార్లమెంటు సభ్యులు కూడా కొంత మంది తెరాసలోకి వెళ్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణపై ప్రభుత్వ ప్రకటనను బట్టి ఆ వలసలు ఉండవచ్చునని భావిస్తున్నారు.
కాగా, తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన లేకుంటే కొత్త పార్టీ పెట్టాలనే యోచన కూడా కాంగ్రెసు తెలంగాణ నేతల్లో సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపించాలనే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ హైదరాబాదు వస్తున్నారు. తన అపాయింట్మెంట్ కోరిన తెలంగాణ పార్టీ నాయకులకు తాను హైదరాబాదు వస్తున్నానని, అప్పుడు అందరినీ కలుస్తానని ఆజాద్ చెప్పారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు కేశవరావు, జానా రెడ్డి నివాసాల్లో సమావేశమవుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తెలంగాణ ప్రకటన కోసం తెలంగాణ కాంగ్రెసు నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని ఈ సమావేశాలే తెలియజేస్తున్నాయి.